
తాను అవమానకర పరిస్థితిలో నిష్ర్కమించేందుకు కారణమైన కాంగ్రెస్ నాయకత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తాను లేని కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలా మనుగడ సాగిస్తుందో నాయకత్వానికి అనుభవపూర్వకంగా చాటి చెప్పనున్నారు. రాష్ట్రంలో జీవచ్ఛవంలా పడిఉన్న కాంగ్రెస్కు ప్రాణాలకు సైతం తెగించి జీవం పోయడమే కాకుండా, రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను తృణప్రాయంగా పక్కకుపెట్టి, తన కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ నాయకత్వానికి జాతీయ స్థాయిలోనే తిరుగులేని గుణపాఠం చెప్పాలని వైఎస్ జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు.
అందుకు యుపిఏ సర్కారులోని భాగస్వామ్యపార్టీల్లో సోనియా వైఖరి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న పెద్ద పార్టీలతో మంతనాలు జరిపి, వారిని కాంగ్రెస్ నుంచి వేరు చేయాలన్న వ్యూహంతో జగన్ ఢిల్లీపై దృష్టి పెట్టారు. ప్రధానంగా.. యుపిఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తీరుపై అసంతృప్తితో ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్పవార్, బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతితో మంతనాలు ప్రారంభించినట్లు జగన్ వర్గీయుల సమాచారం.
ఈ పరిణామాలను సద్వినియోగం చేసుకుని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను దెబ్బతీయాలని జగన్ నిర్ణయించుకు న్నారు. అందులో భాగంగా.. ఆయన శరద్పవార్, మాయా వతితో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. తన వద్ద ఉన్న సంపదను కాంగ్రెస్ పతనానికి వినియోగించాలన్న భావన ఆయనలో కనిపిస్తోంది. బీఎస్పి, ఎన్సీపీతో పాటు కొన్ని చిన్న చితకా పార్టీలను యుపిఏకు మద్దతు ఉపసంహరింపచేసి, దాని ద్వారా వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ముందే అంతా ఒక కూటమిగా ఏర్పడి, కాంగ్రెస్ను చావుదెబ్బతీయాలన్నది జగన్ లక్ష్యమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తన తండ్రికి సన్నిహితుడయిన శరద్పవార్ సలహా కోసం జగన్ త్వరలో ఆయనను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ద్వారా మాయావతి, ఇతర ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చలు జరపాలన్నది జగన్ వ్యూహమంటున్నారు. వీలుంటే అన్నాడిఎంకె అధినేత్రి జయలలితతో కూడా చర్చించాలన్నది జగన్ అభిమతమని చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరిగే జగన్ ఢిల్లీ యాత్రలో ప్రధాన అజెండా ఇదేనని ఆయన వర్గీయులు వివరిస్తున్నారు.

Post a Comment