జగన్ కొత్త పార్టీ !
Written By Mr.D.S on Monday, November 29, 2010 | 7:44 PM
కడప పార్లమెంటు సభ్యత్వానికీ, కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికీ సోమవారం రాజీనామా చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెలలో కొత్త పార్టీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు ఆయన తన మద్దతుదారులయిన ఎమ్మెల్యే, ఎంపీ, అనుచరులతో జగన్ మంత నాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ (వైఎస్) లేదా యువజన శ్రామిక, రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్ కాంగ్రెస్)గా పార్టీకి నామకరణం చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డిసెంబర్ 9 లేదా 10వ తేదీల్లో జగన్ తన కొత్త పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. ఆయన జాతకం, పుట్టిన తేదీ, నక్షత్రాల ప్రకారం ఆ రెండు తేదీలే పార్టీ ప్రకటనకు మంచి రోజులుగా కనిపిస్తున్నట్లు ఏడుగురు పండితులు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు.డిసెంబర్ 5 వరకూ అమావాస్య ఉంటుందని, అది వెళ్లగానే సహజంగా డిసెంబర్ 16 వరకూ అన్నీ మంచిరోజులే అయినప్పటికీ, జగన్ పుట్టినతేదీ, నక్షత్రం ప్రకారం 9 లేదా 10 రోజులూ పార్టీ పేరు ప్రకటించడానికి సానుకూ లంగా ఉంటుందని పండితులు వివరిస్తున్నారు.
ఇదిలాఉండగా, జగన్ పార్టీ పేరు ప్రకటించేలోపే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మృతి చెందిన పావురాల గుట్టకు వెళ్లి, అక్కడే తన తండ్రికి నివాళులు అర్పించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచే ప్రజలనుద్దేశించి తాను ఫలానా తేదీన పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించనున్నట్లు సమాచారం.దాని ద్వారా ప్రజలకు మరోసారి తన తండ్రిని గుర్తు చేయడం, తన తండ్రి కాంగ్రెస్కు జీవితకాలం చేసిన సేవలను కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా విస్మరించి, ఆయన కుటుంబం పట్ల విశ్వాసఘాతుకంగా వ్యవహరించిన వైనాన్ని కూడా వెల్లడించడం ద్వారా.. వైఎస్పై కాంగ్రెస్ పార్టీకి కాకుండా.. వారసుడిగా తనకొక్కడికే పేటెంటీ ఉందన్న సంకేతాలను పంపించడమే జగన్ పావురాల గుట్ట పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
Labels:
రాజకీయం

Post a Comment